ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేశారు. కృష్ణా జిల్లా కేసరపల్లిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆయనతో ప్రమాణం చేయించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఇది నాలుగోసారి. అనంతరం మంత్రులతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, కేంద్ర మంత్రులు అమిత్షా, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ, రామ్మోహన్నాయుడు, చిరాగ్ పాసవాన్తో పాటు వివిధ పార్టీలకు చెందిన పలువురు జాతీయ నాయకులు హాజరయ్యారు. సినీ ప్రముఖులు చిరంజీవి, రజనీకాంత్ దంపతులు, రామ్చరణ్ తదితరులు వచ్చారు.
ముఖ్యమంత్రిగా 4వ సారి ప్రమాణస్వీకారం చేసిన టీడీపీ చీఫ్
టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్… చంద్రబాబుతో ప్రమాణ స్వీకారం చేయించారు. నారా చంద్రబాబు నాయుడు అనే… అంటూ బాబు ప్రమాణం కొనసాగింది. శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికి న్యాయం చేకూర్చుతానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అంటూ ప్రమాణం ఆచరించారు. అనంతరం చంద్రబాబును హత్తుకున్న ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ తదితరులు చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు.
మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్కల్యాణ్
ఏపీ మంత్రిగా జనసేన అధినేత కొణిదెల పవన్కల్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆయనతో ప్రమాణం చేయించారు. పవన్ ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో ప్రాంగణంలోని వారంతా లేచి చప్పట్లతో అభినందించారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ గవర్నర్తో పాటు సీఎం చంద్రబాబుకు పవన్ ధన్యవాదాలు తెలిపారు.
పవన్ కల్యాణ్ అనే నేను..
‘‘కొణిదెల పవన్ కల్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారత దేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడతానని, ఆంధ్రప్రదేశ్ మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంత:కరణశుద్ధితో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను’’ అంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రమాణం చేశారు. ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రెటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ కేసరపల్లి సభావేదికపై పవన్ తో ప్రమాణం చేయించారు. కొణిదెల పవన్ కల్యాణ్ అనే నేను..అంటూ పవన్ పలకగానే ఆయన అభిమానులు, జనసేన కార్యకర్తలు సంతోషం మిన్నంటింది. చప్పట్లు, కేకలతో సభా ప్రాంగణం మార్మోగింది. పవన్ ప్రమాణస్వీకారం చేస్తుండగా ఆయన సతీమణి అన్నా లెజనోవా, సోదరుడు చిరంజీవి ముఖాల్లో సంతోషం వెల్లివిరిసింది. ప్రమాణం పూర్తయ్యాక వేదికపై ఉన్న చంద్రబాబు దగ్గరికి వెళ్లిన పవన్ కల్యాణ్ ఆయనతో కరచాలనం చేశారు. ఈ సందర్భంగా పవన్ ను చంద్రబాబు అభినందించారు. ఆపై వేదికపై ఉన్న గవర్నర్, ఇతర ప్రముఖులకు ఆంధ్రప్రదేశ్ మంత్రి పవన్ కల్యాణ్ నమస్కరించారు. సోదరుడు చిరంజీవికి పాదాభివందనం చేసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.