శ్రీకాకుళం డీఈవో కార్యాలయంలో, సర్వశిక్ష అభియాన్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ సుమారు 50 మంది నిరుద్యోగుల నుంచి శేషగిరి అనే వ్యక్తి పెద్దఎత్తున వసూళ్లకు పాల్పడినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. విద్యాశాఖ ఉద్యోగులంటూ కొందరితో ఫోన్లు చేయించి నమ్మబలికాడని.. ఒక్కొక్కరి నుంచి రూ. 50 వేల నుంచి రూ. 2 లక్షల వరకు ఉద్యోగాల పేరిట 2025లో వసూళ్లు చేశాడని చెబుతున్న బాధితులు దీనిపై విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్కు, హోం మంత్రి అనితకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
2025 మే నుంచి మొదలైన ఈ అక్రమ వసూళ్ల తరువాత త్వరలోనే విజయవాడలో సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అవుతుందంటూ నమ్మబలికారని.. అపాయింట్మెంట్ ఆర్డర్లు కొందరికి వచ్చినట్లు ఫేక్ ఆర్డర్లు చూపించి మిగతావారిని మభ్యపెట్టారని బాధితులు చెప్తున్నారు.
అయితే… ఇదిగో అదిగో అంటున్నా ఎప్పటికీ సర్టిఫికేట్ల వెరిఫికేషన్కు పంపించకపోవడంతో అనుమానం వచ్చిన కొందరు బాధితులు ఆరా తీయగా అలాంటి ఉద్యోగాలే లేవని.. తమలాంటి ఎందరినో ఇలా మోసం చేస్తున్నారని తెలుసుకున్నారు.
దీంతో తీసుకున్న డబ్బు తిరిగి ఇచ్చేయాలని శేషగిరిని బాధితులు అడగ్గా ఇదిగోఅదిగో అంటూ కాలయాపన చేస్తూ తప్పించుకుని తిరుగుతున్నాడని బాధితులు చెబుతున్నారు.
కొందరు బాధితులైతే… త్వరలోనే ఇచ్చేస్తానని, క్రెడిట్ కార్డు నుంచి తీసి ఇవ్వడానికి రూ. 5 వేలు, రూ. 10 వేలు అవసరమంటూ మళ్లీ అదనంగా డబ్బులు తీసుకున్నాడని చెబుతున్నారు.
ఉద్యోగాల పేరిట తమ నుంచి వేలు, లక్షల్లో డబ్బులు తీసుకుని తప్పించుకుని తిరుగుతున్న మోసగాళ్లపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.
(ఎవరెవరి నుంచి ఎంతెంత తీసుకున్నారు? ఈ ముఠాలో ఎవరెవరు ఉన్నారు? నిందితులు ఎక్కడివారు? రేపు ప్రత్యేక కథనం)










