ధర్మ ధీక్షకు బీసీ సంఘాలనుంచి అనూహ్య మద్దతు
బీసీ హక్కుల సాధనే ధ్యేయంగా భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ చేపట్టిన ఆమరణ నిరాహార ధీక్ష 4వ రోజుకు చేరింది. ఏప్రిల్ 11న మంగళగిరిలోని తన పార్టీ ప్రధాన కార్యాలయంలో చేపట్టిన ఈ ధీక్షకు పలు బీసీ సంఘాలు మద్దతు పలికాయి.
తొలిరోజున జ్యోతిరావు ఫూలే, బీపీ మండల్ వారసులు హాజరై మద్దతు ప్రకటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రెండోరోజున పలు బీసీ సంఘాలు, రాజకీయ పార్టీల నేతలు మద్దతు పలికారు. ఇక మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఇప్పటికే మద్దతు పలికారు. వంగవీటి రంగా కుమార్తె ఆశాకిరణ్ మద్దతు పలకడంతోపాటు బీసీపట్ల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ప్రశ్నించారు.
అయితే బోడె రామచంద్ర యాదవ్ చేపట్టిన ఆమరణ నిరాహార ధీక్ష నాలుగోరోజుకు చేరినా ఏపీ ప్రభుత్వం కనీసం స్పందించకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ప్రారంభం అయ్యాయి. పలుచోట్ల రాస్తారోకోలు, ధర్నాలు జరిగాయి. బోడె రామచంద్ర యాదవ్ రోజురోజుకూ క్షీణిస్తుండడం కూడా బీసీ సంఘాలను ఆందోళన కలిగిస్తోంది. బోడె రామచంద్రయాదవ్ చేస్తున్న ఆమరణ నిరాహార ధీక్ష వ్యక్తిగతం కాదని, బీసీల అభ్యున్నతి కోసమేనని, అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఏంటనే ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
ఇక బోడె రామచంద్రయాదవ్ చేపడుతున్న ధీక్షా స్థలికి పలు పార్టీల నాయకులు హాజరై బోడె రామచంద్ర యాదవ్ కు సంఘీభావం ప్రకటించారు. ఆయన చేస్తున్న డిమాండ్లు సహేతుకమైనవని, వాటిని అమలు చేయడం కూడా పెద్ద కష్టం కాదని, అయినా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని విమర్శలు గుప్పించారు.
ఈ డిమాండ్ల సాధనకే ఆమరణ నిరాహార ధీక్ష
1. బీసీ రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలి.
2. రాజధాని అమరావతి ప్రాంతంలో బీసీలకు వెయ్యి ఎకరాలు కేటాయించాలి.
3. రాష్ట్రంలో సమగ్ర కులగణన చేపట్టాలి.
4. విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 44 శాతం రిజర్వేషన్లు కల్పించాలి.
5. బీసీ కార్పొరేషన్లకు వెంటనే నిధులు విడుదల చేయాలి.
ఈ ధీక్ష చేస్తున్న బోడె రామచంద్రయాదవ్ మీడియాతో మాట్లాడుతూ బీసీలకు సమన్యాయం జరిగే విధంగా తాను డిమాండ్ చేస్తున్న ఐదు అంశాల అమలుకు ప్రభుత్వం అంగీకరించేవరకు తాను ధీక్ష విరమించేది లేదని చెప్పారు.









