రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షించారు. వర్షాలు అధికంగా ఉన్న ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, వివిధ శాఖల అధికారులతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం సమీక్షించారు. వర్షాలు, వరదలు వచ్చిన తరువాత కాకుండా వాతావరణ శాఖ హెచ్చరికలను అంచనా వేసి ప్రజలను అప్రమత్తం చేయాలని, తద్వారా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా పని చేయాలని ఆదేశించారు. ఈ ఏడాది లో ఇప్పటి వరకు సాదారణ వర్షపాతం 185 మి.మి గాను 244 మి.మి నమోదైందని, రాష్ట్ర వ్యాప్తంగా 31 శాతం అదనంగా వర్షపాతం నమోదైందని అన్నారు. 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయిన ప్రాంతాలు కూడా ఉన్నాయన్నారు. చెరువు కట్టలు, వాగుల్లో ప్రవాహాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలనీ, గత ప్రభుత్వంలో ఇష్టానుసారంగా ఇసుక, మట్టి అక్రమ తవ్వకాల వల్ల గోదావరి కట్టలు బలహీన పడ్డాయని, వీటిపై దృష్టిపెట్టాలని అన్నారు. ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. విపత్తులు వచ్చినప్పుడే పనితీరు, సమర్థత బయటపడుతుందని, వర్షాల నేపథ్యంలో అధికారులు పూర్తి అప్రమత్తంగా పనిచేయాలన్నారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ విషయంలో గతంలో ఉన్న వ్యవస్థలను వైసీపీ ప్రభుత్వం నాశనం చేసిందని, మళ్ళీ వాటిని యాక్టివేట్ చేయాలని సూచించారు.