బీసీ హక్కుల సాధనే ధ్యేయంగా మూడు రోజులుగా ఆమరణ నిరాహార ధీక్ష చేస్తున్న బీసీవై అధ్యక్షులు బోడె రామచంద్ర యాదవ్ ఆరోగ్యం క్షీణిస్తుండడంతో బీసీ వర్గాల్లో ఆందోళన నెలకొంది. బీసీలకు సమన్యాయం కల్పించాలనే డిమాండ్ తో బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ మంగళగిరిలోని తన పార్టీ కార్యాలయంలో ఆమరణ నిరాహార ధీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే.
ఏప్రిల్ 11న ప్రారంభమైన ఈ ఆమరణ నిరాహార ధీక్ష మూడో రోజుకు చేరడంతో ఆయన ఆరోగ్యం క్షీణించింది. ఆయన శరీరంలో ఎలక్ట్రోలైట్స్, మినరల్స్, కాల్షియం, మెగ్నీషియం, గ్లూకోజ్ స్థాయిలు గణనీయంగా తగ్గాయి. ఆక్సిజన్ సాచురేషన్ లెవల్స్ కూడా పడిపోవచ్చని వైద్య బృందం హెచ్చరించింది. దీంతో బీసీ సంఘాల్లో ఆందోళన నెలకొంది. అయినప్పటికీ, ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీలు, న్యాయపరమైన డిమాండ్లు నెరవేర్చే వరకు తన దీక్షను విరమించే ప్రసక్తే లేదని రామచంద్రయాదవ్ స్పష్టం చేశారు.
బీసీ రక్షణకు చట్టం తేవాలని, సమగ్ర కుల గణన జరగాలని, బీసీ కార్పొరేషన్లకు నిధులు పెంచాలని, అమరావతిలో బీసీలకు వెయ్యి ఎకరాల భూమి కేటాయించాలనే డిమాండ్ తో పాటు బీసీలకు విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థలు, చట్టసభల్లో 44 శాతం రిజర్వేషన్ ఇవ్వాలనే డిమాండ్ ఆయన ఈ ఆమరణ నిరాహార ధీక్ష చేపట్టారు.
గతంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీల్లోనూ ఇవి ఉన్నాయి. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఈ ఆమరణ నిరాహార ధీక్ష చేపట్టినా ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం ఏంటని బీసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
రామచంద్రయాదవ్ ధర్మదీక్షకు దేశవ్యాప్తంగా మద్దతు వెల్లువెత్తుతోంది. తొలిరోజున బీసీ మండల్ మనుమడు సూరజ్ మండల్, మహాత్మా జ్యోతిబా పూలే మునిమనుమరాలు రమాకాంత్ పూలేతో పాటు పలు పార్టీల నేతలు సంఘీభావం తెలిపారు. మాజీ రాజ్యసభ సభ్యులు వి. విజయసాయి రెడ్డి కూడా ట్విట్టర్ ద్వారా దీక్షకు పూర్తి మద్దతు ప్రకటించారు. వీరితోపాటు తెలగ, కాపు, బలిజ జెఎసి ఛైర్మన్ దాసరి రాము, అఖిల భారత యాదవ సంఘం జాతీయ అధ్యక్షులు బుసగాని లక్ష్మయ్య, కార్యదర్శి పిఎల్పి యాదవ్, జాతీయ యాదవ సంఘం సెక్రటరీ జనరల్ బొడ్డు రమేష్ యాదవ్, జాతీయ బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆవుల నరసింహారావుతో సహా దాదాపు 40కిపైగా బీసీ కుల సంఘాలు మద్దతు పలికాయి.
రామచంద్రయాదవ్ ఆమరణ నిరాహార ధీక్షపై కాపు, తెలగ, బలిజ జేఏసీ చైర్మన్ దాసరి రాము మాట్లాడుతూ కాపు, తెలగ, బలిజ జేఏసీ తరపున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని తెలిపారు. బడుగు, బలహీన వర్గాలు రాజ్యాధికారం చేపట్టాలనే రామచంద్రయాదవ్ ఆశయానికి తాము అండగా ఉంటామన్నారు.









