తాడేపల్లిగూడెం : ఆంధ్రప్రదేశ్లోని అన్ని వర్గాలను జగన్ మోసం చేశారని, సిద్ధం అంటున్న ఆయనకు యుద్ధం ఇద్దామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. తాడేపల్లిగూడెంలో నిర్వహించిన టీడీపీ – జనసేన ఉమ్మడి సభలో పవన్ మాట్లాడారు. ‘‘పర్వతం ఎవరికీ వంగి సలాం చేయదు. గొంతు ఎత్తితే ఒక దేశపు జెండాకు ఉన్నంత పొగరు ఉంటుంది. మన విజయానికి స్ఫూర్తి జెండా.. అందుకే జెండా పేరుతో సభను ఏర్పాటు చేశామని తెలిపారు. ఏపీ రోడ్లపై వెళ్లాలంటే రోజులు గడిచిపోయే పరిస్థితి. ఐదుగురు రెడ్ల కోసం 5 కోట్ల ప్రజలు తిప్పలు పడుతున్నారు. రాష్ట్రంలో ఏ జిల్లాలో అయినా ఈ ఐదుగురే పంచాయితీ చేస్తున్నారు. మిగతా ఏ నాయకులకు ఎలాంటి హక్కులు లేవు. సభా వేదికగా చెబుతున్నా. వైసీపీ గూండాలు తెలుగు-జనసేన నాయకులను, శ్రేణుల్ని ఇబ్బంది పెడితే మక్కెలు విరగొడతామన్నారు.
చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి అవసరం : తాను ఒక్కడినే అంటున్న జగన్ మా ఒక్క ఎమ్మెల్యేను లాక్కున్నారు. జూబ్లీహిల్స్ ఫాంహౌస్లో ఇల్లు కట్టుకున్నప్పట్నుంచి జగన్ బతుకు నాకు తెలుసు. జగన్ ఇప్పటి వరకు పవన్ తాలూకా శాంతినే చూశావు. 4 దశాబ్దాల రాజకీయ ఉద్ధండుడిని జైలులో పెడితే బాధ వేసింది. అందుకోసమే కూటమిని నేనే ప్రతిపాదించా. చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి అవసరం. నా నిర్ణయాలు పార్టీ, వ్యక్తి పరంగా ఉండవు, రాష్ట్ర లబ్ధికోసమే ఉంటాయి. టీడీపీ-జనసేన సహకరించుకుంటూనే ప్రజల భవిష్యత్తు బాగుంటుంది. కోట్లు సంపాదించే స్కిల్స్ ఉన్నా అన్నీ కాదనుకొని వచ్చా. సినిమాల్లో వచ్చే డబ్బును ఇంట్లో బియ్యం కొనకుండా హెలికాప్టర్లకు వెచ్చిస్తున్నానని పవన్ అన్నారు.