కలిసికట్టుగా సామాజిక ఆర్థిక అభివృద్ధి ..
పే దరికానికి ఎదురు నిలిచిన ఆదర్శ గ్రామం..
సామాజిక వెనుకబాటుతనానికి ఎదురు నిలిచి రాజ్యాంగం కల్పించిన హక్కులు, సౌకర్యాలను ఆసరాగా చేసుకుని ఆదర్శ గ్రామంగా నిలుస్తోంది ఎర్రబండ. జిల్లాలోని మారుమూల ప్రాంతమైన కంబదూరు మండలం లోని ఈ గ్రామంలో సామాజిక ఆర్థిక అభివృద్ధికి బాటలు వేస్తున్నారు ఇక్కడి యువత. కేవలం 40 కుటుంబాలు నివసించే గ్రామంలో 13 మంది ప్రభుత్వ ఉద్యోగాలు, ఆరుగురు ప్రైవేటు కొలువులు సాధించి యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. జీవన కట్టుబాట్లు, సామాజిక పరిస్థితులను ఒక అవకాశం గా చేసుకొని ఈ గ్రామం నుండి ఇటీవల గ్రూప్ 2లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం సాధించి న రాజశేఖర్ మార్గదర్శిగా నిలిచి ప్రభుత్వ ఉద్యోగాల పరంపరను కొనసాగిస్తున్నారు.
వ్యవసాయమే తోడుగా..
ఓకే సామాజికవర్గం నుంచి ఈ స్థాయిలో ఉద్యోగాలు సాధించే క్రమంలో వ్యవసాయం, కూలి పనులు చేస్తూ ఉన్నత విద్యను పూర్తి చేసి ఇక్కడి యువత ఉద్యోగాలు సాధస్తున్నారు. పోలీసు శాఖలో నలుగురు, విద్యాశాఖలో నలుగురు, బ్యాంకింగ్ తదితర శాఖల్లో 5 గురు ప్రభుత్వ కొలువులతో ముందుకు సాగుతున్నారు. 6 గురు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు సాధించి ఈ రంగంలోనూ తమదైన ముద్ర వేస్తున్నారు. ఇప్పుడు కూడా పదుల సంఖ్యలో యువత డిగ్రీలు పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగాల అన్వేషణలో తలమునకలై ఉన్నారు.
ఒకే మాట- ఒకే బాట..
గ్రామంలో ఉద్యోగాల్లో స్థిరపడిన వారు ఏటా తరచూ కలుస్తూ యువతకు సలహాలు సూచనలు ఇస్తుంటారు. దీంతో యువతలో ఉద్యోగాలు సాధించాలన్న పట్టుదల కనిపిస్తోంది. పండుగల వేళ ఉద్యోగులు గ్రామానికి చేరుకుని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించి గ్రామస్థులను ఏకతాటిపైకి తెచ్చి ఆదర్శంగా నిలుస్తున్నారు. గత సంక్రాంతికి గ్రామంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు గ్రామస్తుల ఐక్యతకు వేదికగా నిలిచాయి. గ్రామ పెద్దలు, ఉద్యోగులు ఒకే మాటపై నిలుస్తూ ఒకరికొకరు తోడుగా ఆర్థిక అభివృద్ధికి బాటలు వేసుకుంటున్నారు. ఎక్కడో ఉద్యోగాలు చేస్తున్న వారు కూడా ఇక్కడే భూములను కొనుగోలు చేసి వ్యవసాయం చేస్తూ మూలాలు మర్చిపోకుండా గ్రామాభివృద్ధికి ఆలంబనగా నిలుస్తున్నారు.
ప్రశంసలు ..
గ్రామం నుండి కొలువులు సాధించిన వారు వారి వృత్తిపరమైన జీవితాల్లో కూడా రాణించి ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతున్నారు. గ్రామం నుంచి ఎస్సైగా ఎంపికై తిరుపతిలో పనిచేస్తున్నరామాంజనేయులు డీజీపీ గారి నుంచి ఎబిసి అవార్డు తీసుకున్నారు. కంబదూరులోనే ఎల్ ఎస్ ఏ గా పనిచేస్తున్న పద్మజ పంద్రాగస్టు నాడు మంత్రి చేతుల మీదుగా అవార్డు అందుకోవడం గమనార్హం. విద్యాశాఖలో పనిచేస్తున్నవారు కూడా ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు దక్కించుకున్నారు.
మూలాలు మరువరాదు..
ప్రతికూల పరిస్థితు ల్లో చదవడం వలన నా మానసిక దృక్పథం రెట్టింపు అయింది. జీవితంలో ఎదగడానికి చదువు ఒక్కటే మార్గం. ఎలాంటి ఉన్నత స్థితిలో ఉన్న మూలాలు మరిచిపోకూడదు. – SI రామాంజినేయులు
పట్టుదలతోనే విజయం..
సూర్యకిరణాలను అరచేతితో ఎలా ఆపలేమో.. అలాగే కృషి, పట్టుదల ఉంటే ఎన్నో విజయాలు వరిస్తాయి. పుట్టుకతో తల్లిదండ్రులు మనల్ని ఈ ప్రపంచానికి పరిచయం చేస్తారు. వారిని ప్రపంచానికి పరిచయం చేయడానికి మనం ఉన్నతంగా ఎదగాలి.-LSA పద్మజ









