తిరుమల ప్రధాన కల్యాణకట్టలో నూతనంగా అందుబాటులోకి వచ్చిన 4వ నెంబర్ హాలులో టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్, తిరుమల జెఈవో శ్రీ కెఎస్ శ్రీనివాసరాజులు కలసి శుక్రవారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా మీడియాతో ఈవో మాట్లాడుతూ కల్యాణకట్టలోని 4వ హాల్ రూ.34 లక్షలతో పునరుద్దరించి భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. గత 9 నెలల కాలంలో కల్యాణకట్ట పునరుద్దరణ కోసం దాదాపు రూ.1.60 కోట్లు ఖర్చు చేసి పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు చెప్పారు. భక్తులు సౌకర్యవంతంగా తలనీలాలు సమర్పించేందుకు వీలుగా ఏర్పాట్లు చేశామన్నారు. శ్రీవారి భక్తులు సులువుగా, సౌకర్యవంతంగా తలనీలాలు సమర్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం జెఈవోతో కలసి 4వ హాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో ఎస్.ఇ2 శ్రీ రామచంద్రారెడ్డి, కల్యాణకట్ట డిప్యూటి ఈవో శ్రీ సి. వెంకటయ్య, ఆరోగ్యశాఖాధికారి శ్రీమతి డా. శర్మిష్ఠ, డిఇ (ఎలక్ట్రికల్ ) శ్రీమతి సరస్వతి, ఈఈ (సివిల్) శ్రీ ప్రసాద్, ఎవిఎస్వో శ్రీ చిరంజీవులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.